శుక్రవారం, 13 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 జూన్ 2025 (20:04 IST)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

adinarayana reddy
రాజధాని అమరావతిని దెబ్బతీసేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డిలు కుట్ర పన్నారని, వీరిద్దరి వల్లే దరిద్రం పట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. అమరావతి మహిళలపై సాక్షి టీవీ యాంకర్ల వ్యాఖ్యల దుర్మార్గమన్నారు. పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. 
 
ఆయన బుధవారం కడపలో విలేకరులతో మాట్లాడుతూ, కొమ్మినేని శ్రీనివాస రావు, కృష్ణంరాజులు చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర దాగి వుందని ఆయన ఆరోపించారు. జగన్, భారతి రెడ్డిలు కుట్రపూరితంగానే అమరావతిని దెబ్బతీయాలని, అక్కడ చిచ్చుపెట్టాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. 
 
జగన్, భారతి వల్లే రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందని అన్నారు. మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా, గత ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన అక్రమాలకు పాల్పడిన నేతలంతా జైలు ఊచలు లెక్కించకతప్పదని ఆయన హెచ్చరించారు. 
 
అలాగే, జగన్‌పై ఆదినారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కన్నతల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగించారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వికాసం దిశగా అడుగులు వేస్తుంటే వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.