తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..
నేటి తరం చిన్న చిన్న విషయాలకే ఆగ్రహానికి గురికావడం.. చాలా సున్నితంగా వున్నారు. తాజాగా తల్లి మందలించిందనే మనస్తాపంతో ఓ 14 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. అంతేగాకుండా తనతో పాటు సైకిల్ను కూడా తీసుకెళ్లాడు. సైకిల్లోనే మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి 11 గంటల వరకు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ జంక్షన్కు చేరుకున్నాడు.
అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన దేవునిపల్లి పోలీసులు ఆపి, అసలు విషయం తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకుని, బాలుడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.