బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జులై 2024 (15:54 IST)

ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు : మైనర్లు అత్యాచారం చేసి చంపేశారు.. శవాన్ని తండ్రి మాయం చేశాడు..

victim
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యం కేసుకు సంబంధించి ఆశ్చర్యకర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయాలు తెలుసుకుని పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. బాలికను అత్యాచారం చేసిన ముగ్గురు మైనర్లు.. ఆపై హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు శవాన్ని మాయం చేశారు. 
 
ఈ దారుణానికి పాల్పడిన మైనర్లకు నిండా 15 యేళ్ళుకూడా నిండలేదు. ఈ నెల 7న పార్కులో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని ముళ్లపొదల్లో దాచి ఇంటికెళ్లిపోయారు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి చదువుతుండగా, మరో బాలుడు ఆరో తరగతి చదువుతుండడం గమనార్హం. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. 
 
ఇలా చేయాలని మీకెలా తెలిసిందని ప్రశ్నిస్తే నివ్వెరపోయే విషయం చెప్పారు. ఇవన్నీ ఇంటర్నెట్‌లో చూసి నేర్చుకున్నామని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. శవాన్ని ఎలా మాయం చేశారన్న ప్రశ్నకు మాత్రం పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేయడంలో ఓ బాలుడి తండ్రి, పెదనాన్న పాత్ర ఉందని తెలిసి వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది.
 
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలురు విషయాన్ని ఎక్కడ బయటపెట్టేస్తుందోనని భయపడి గొంతు నులిమి హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని తీసుకెళ్లి కేసీ కెనాల్ దగ్గర ముళ్లపొదల్లో దాచి ఇంటికెళ్లిపోయారు. నిందితుల్లో ఒకడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బాలుడి తండ్రి, పెదనాన్ని కలిసి మృతదేహాన్ని బైకుపై వనుములపాడు మీదుగా కృష్ణా నది వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అలానే పడేస్తే తేలుతుందని భావించి బండరాయి కట్టి నీటిలో పడేశారు. 
 
కాగా, నిందితులు చెప్పిన ప్రాంతంలో గాలించినా మృతదేహం దొరక్కపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాలిక మృతదేహం లభించే వరకు గాలింపు కొనసాగుతుందని నద్యాల ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. మరోవైపు, ఈ కేసులో నిందితులైన బాలురను పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. మృతదేహాన్ని మాయం చేయడంలో సహకరించిన కాటం యోహాన్, బొల్లెద్దుల సద్గురుడును రిమాండ్‌కు తరలించారు.