సంబంధిత వార్తలు
- 2028లో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారు.. కేటీఆర్
- నన్ను బెదిరించడానికి మీరెవరు? తెలంగాణ ఎవరి జాగీరూ కాదు.. పవన్ వార్నింగ్ (video)
- జనసేన ఊపిరిలూదుకున్నది తెలంగాణ గడ్డపైనే : పవన్ కళ్యాణ్
- Mahesh Babu : తెలుగు రాష్ట్రాలలో ఏకైక ఐమాక్స్ స్క్రీన్ను లాంచ్ చేయనున్న ఏఎంబీ సినిమాస్
- పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ
తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న
తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేతలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా అనేక ప్రశ్నలు సంధించారు. ఆంధ్రా వ్యాపారవేత్తలు మాత్రం తెలంగాణాలో సంతోషంగా కాంట్రాక్టులు చేసుకోవచ్చు... పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ గడ్డపై అడుగుపెట్టకూడదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే ప్రత్యేకంగా పాస్పోర్టు తీసునిరావాలా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏమైనా పాకిస్థాన్లో ఉందా..? భారత దేశంలో అంతర్భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు.
జనసేన పార్టీ నిర్వహించతలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన హైదరాబాద్ నగరంలోని తన నివాసంలోనే విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నేల నేర్పించిన విలువలనే పార్టీ సిద్ధాంతాలుగా పెట్టుకున్నానని, చచ్చిపోయేందుకు కూడా సిద్ధపడే పార్టీ పెట్టానని ప్రకటించారు.
తెలంగాణకు వస్తే తనను ఏదో చేస్తామంటూ కొందరు చేసిన బెదిరింపులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'ఇది భారతదేశం అనుకున్నారా? పాకిస్థాన్, పాలస్తీనా అనుకున్నారా? పాశం యాదగిరి అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇదే ఇంట్లో కూర్చొని నేను రెండు మూడు గంటలు మాట్లాడాను. అలాంటి వ్యక్తి తిడుతుంటే బాధేసింది. తెలంగాణ ఏర్పాటును సీపీఎం, ఎంఐఎం కూడా వ్యతిరేకించాయి. మరి ఆ పార్టీలను మీరెందుకు ప్రశ్నించరు? నోరు తెరవని జనసేననే టార్గెట్ చేస్తున్నారు.. మేం భయపడతామనా? నేను చచ్చిపోయేందుకు సిద్ధపడే పార్టీ పెట్టా. మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టిపడుతుంది తప్ప భయపడదు గుర్తు పెట్టుకోండి' అని హెచ్చరించారు.
'ప్రాంతీయత పేరుతో జాతీయ వాదాన్ని బలహీన పరిస్తే జనసేన అంగీకరించదు. ప్రాంతీయ వాదం తీసుకొస్తే దేశ సుస్థిరత దెబ్బతింటుంది. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం హానికరం. రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయవచ్చా? ఇందిరాగాంధీ మెదక్లో, పీవీ నరసింహారావు నంద్యాలలో పోటీ చేశారు. ప్రాంతీయ వాదమే.. కాంగ్రెస్ వాదమా? కాంగ్రెస్కు ఒక పద్ధతి అంటూ ఉందా? జాతీయ పార్టీ ప్రాంతీయవాదం మాట్లాడొచ్చా? ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్పోర్టు తీసుకొని వెళ్లాలా? మళ్లీ గడీల పాలన తీసుకొస్తారా? నేను ప్రెస్మీట్పెడితే శాంతిభద్రతల సమస్య అవుతుందా? మాపై విమర్శల వెనుక రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఉన్నారని అనుకోను. పెచ్చుమీరుతున్న ప్రాంతీయవాదంపై కేంద్రం దృష్టిపెట్టాలి. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తాం. భాజపా మాతో కలిసి వస్తుందో లేదో తెలియదు' అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
