గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (17:53 IST)

బల్దియా పోరుకు సర్వం సిద్ధం : కట్టుదిట్టంగా భద్రత.. పాతబస్తీలో గస్తీ ముమ్మరం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా డిసెంబరు ఒకటో తేదీ మంగళవారం ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంతా సున్నిత ప్రాంతాలతో పాటు.. పాతబస్తీలో గస్తీని ముమ్మరం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకుగాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256. ఇక, పోలింగ్ కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు.
 
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 డీఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రి పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ మాత్రమే కాకుండా, డీఆర్సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ కూడా చేపట్టనున్నారు. 
 
కాగా, జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా 2,336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 1,207 అతి సున్నితమైన, 279 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా ఎస్ఈసీ గుర్తించింది. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
 
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. జోన్ల వారీగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారీగా ఇన్చార్జి ఏసీపీ, సీఐలను నియమించారు. ఎన్నికల ఫలితాలు డిసెంబరు నాలుగో తేదీన వెల్లడికానున్నాయి.