1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జులై 2022 (11:45 IST)

భార్యను కాపాడబోయి భర్త.. తండ్రిని రక్షించబోయి ఇద్దరు పిల్లలు ...

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి పట్టణంలో దారుణం జరిగింది. విద్యుతాఘాతానికి గురైన భార్యను రక్షించబోయి భర్త, తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పిల్లలతో కలిసి మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదాకర ఘటన కామారెడ్డి పట్టణంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన అహ్మద్‌(35) అనే వ్యక్తి ఆటోడ్రైవర్‌గా ఉన్నాడు. ఈయనకు భార్య పర్వీన్‌(30), కుమార్తె మహీమ్‌(6), కుమారులు ఫైజాన్‌(5), అద్నాన్‌(3)లు ఉన్నారు. వీరందరూ చిన్న రేకుల ఇంట్లో జీవిస్తున్నారు. 
 
మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో ఫైజాన్‌ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. మిగతా వాళ్లు ఇంట్లోనే ఉన్నారు. ఇంటి గోడకు కట్టిన దండెం(ఇనుప తీగ)పై పర్వీన్‌ దుస్తులను ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆమెను కాపాడేందుకు పట్టుకున్న అహ్మద్‌ కూడా కరెంటు షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులు కుప్పకూలడం చూసిన మహీమ్‌, అద్నాన్‌లకు వారికేమైందో అర్థం కాలేదు. కేకలు వేస్తూ వెళ్లి వారిని ముట్టుకున్నారు. 
 
విద్యుదాఘాతానికి గురై వారూ కన్నుమూశారు. పిల్లల కేకలు విని వచ్చిన చుట్టుపక్కలవారు వెంటనే విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. నలుగురి మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కరెంటు ఫ్యూజ్‌, వైర్‌ పక్క నుంచే దండెం కట్టి ఉండటంతో.. దానికి విద్యుత్‌ సరఫరా జరిగి ప్రమాదానికి దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. 
 
పర్వీన్‌ తండ్రి హకీమ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు.