శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (10:35 IST)

మేడారం జాతరకు అంతా సిద్ధం - బందోబస్తుకు వచ్చిన పోలీసు మృతి

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర (గిరిజన)గా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం పలు జాగ్రత్తల నడుమ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంది. 
 
ఈ  జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రకటించారు కూడా. అందుకు తగిన విధంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలు స్వయంగా పరిశీలించారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమ్మవారి గద్దెలు, జంపన్న వాగులో ఎప్పటికపుడు శానిటైజేషన్ చేస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఈ జాతర కోసం దేశం నలుమూలల నుంచి నాలుగు కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ జాతర బందోబస్తు కోసం వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బి.రమేష్ మేడారం జాతరకు బందోబస్తు కోసం వచ్చారు. అయితే, ఆయన మంగళవారం సమ్మక్క సారక్క ఆలయ బయటి గేటు వద్ద విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఆయనకు ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను స్థానికులు హుటాుహటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు.