1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఫిబ్రవరి 2022 (08:45 IST)

వెస్టిండీస్‌తో మూడో వన్డే.. భారత్ అదుర్స్.. సిరీస్ కైవసం

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ అదరగొట్టింది. తన ఖాతాలో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
 
అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి వన్డేలో 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. 266 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్‌ 169 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విండీస్‌ బ్యాటర్లలో ఓడీన్‌ స్మిత్‌ (36) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ చెరో మూడు వికెట్లు తీశారు. దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
 
లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు. విండీస్‌ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (34), డారెన్‌ బ్రావో (20)లు ఇన్నింగ్స్‌ని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. 
 
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్‌ అయ్యర్‌ (80), యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. 
 
ఆఖర్లో వచ్చిన దీపక్‌ చాహర్‌ (38), వాషింగ్టన్‌ సుందర్‌ (33) ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (6), కుల్దీప్‌ యాదవ్‌ (5), మహమ్మద్‌ సిరాజ్‌ (4) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్‌, హేడెన్‌ వాల్ష్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఓడీన్‌ స్మిత్‌, ఫేబియన్‌ అలెన్‌ తలో వికెట్ పడగొట్టారు.