1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:00 IST)

వెస్టిండీస్‌తో రెండో వన్డే.. 44 పరుగులతో భారత్ ఘనవిజయం

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగులతో ఘనవిజయం అందుకుంది. ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 11న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.
 
238 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్‌ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రధాన భూమిక పోషించాడు.
 
ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 2, సిరాజ్ 1, చహల్ 1, సుందర్ 1, హుడా 1 వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో షామ్రా బ్రూక్స్ అత్యధికంగా 44 పరుగులు సాధించాడు.
 
లోయరార్డర్‌లో అకీల్ హోసీన్ (34), ఓడియన్ స్మిత్ (24) రాణించినా అది కాసేపే అయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 46 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. 
 
అంత‌కుముందు టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 237 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ హాఫ్ సెంచ‌రీ (64)తో రాణించాడు. రాహుల్ 49 ప‌రుగుల‌తో స‌హ‌క‌రించాడు. 
 
దీప‌క్ హుడ్ 29, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 24, కోహ్లీ 18, పంత్ 18, చాహ‌ల్ 11*, ఠాకూర్ 8, రోహిత్ 5, సిరాజ్ 3 ప‌రుగులు చేశారు. ఇక విండీస్ బౌల‌ర్ల‌లో జోసెఫ్, స్మిత్ రెండేసి.. రోచ్‌, అకేల్ హూసేన్, ఫైబిన్, హోల్డ‌ర్ త‌లో వికెట్ తీశారు.