గురువారం, 27 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (16:18 IST)

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

siddharamaiah
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కాంగ్రెస్ అధిష్టానంపై కీలక సూచన చేశారు. తన భవితవ్యంపై నాన్చుడి ధోరణి అవలంభించకుండా అటో ఇటో తేల్చాలని కోరారు. కర్నాటక రాష్ట్రంలో నవంబరు నెలాఖరు నాటికి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మరోమారు స్పందించారు. ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించాలని, ఇందుకోసం అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
 
2023లో జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ గద్దెనెక్కిన నాటి నుంచీ రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. నవంబరు 20తో ఆ రెండున్నరేళ్ల గడువు ముగిసింది. దాంతో కర్ణాటక రాజకీయాలు వేడేక్కాయి. ఐదేళ్లూ సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని ఒకవైపు డీకే చెప్తున్నా.. మరోవైపు సీఎం పదవిపై ఆశను పరోక్షంగా వ్యక్తంచేస్తున్నారు. 
 
కర్ణాటక రాజకీయాల్లో మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఇంకోవైపు విపక్ష నేతలు జోస్యం చెప్తున్నారు. 'కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా తీవ్ర గందరగోళంలో ఉంది. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు' అని కేంద్ర మంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధూ స్పందన వచ్చింది.