గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (20:44 IST)

దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నాను : సీఎం కేసీఆర్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు గడుస్తున్నా దళితులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని, ఆ దళితుల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలని తాను కోరుతున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసమే కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నానని చెప్పారు. 
 
దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రావాలని కోరుతున్నానని తెలిపారు. భారతదేశం అమెరికా కన్నా గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. 
 
కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది... దీన్ని అడ్డుకునేందుకు కొత్త రాజ్యాంగం రాయాలి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలా భారతదేశం కూడా మారాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని స్పష్టం చేశారు.
 
ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అసోం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని, తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
కర్నాటక రాష్ట్రంలో ఉత్పన్నమైన హిజాబ్ వివాదంపైనా కేసీఆర్ స్పందించారు. ఈ వివాదంపై ప్రధానితో పాటు దేశం మొత్తం మౌనం వహిస్తోందని.. అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేంటని నిలదీశారు. కర్ణాటక పరిస్థితి దేశ వ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటన్నారు. 
 
బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.