శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (07:44 IST)

లంచంగా తీసుకున్న కరెన్సీ నోట్లను గ్యాస్‌స్టౌవ్‌పై వేసి తగులబెట్టిన తెరాస నేత...

తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీకి చెందిన ఓ నేత చేసిన పనికి ప్రతి ఒక్కరూ విస్తుపోయారు. తాను లంచంగా తీసుకున్న రూ.6 లక్షల నోట్ల కట్టలను తగులబెట్టాడు. దీనికి కారణం... ఈ విషయం అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియడమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల పరిధిలో క్రషర్‌ ఏర్పాటుకు తహసీల్దార్‌ సైదులు ఓ వ్యక్తి నుంచి రూ.6 లక్షలు డిమాండ్ చేశారు. వాటిని మధ్యవర్తిగా ఉన్న మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటాయ గౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్‌ సూచించారు. 
 
ఈ క్రమంలో కల్వరుర్తిలోని విద్యానగర్‌లో ఉన్న తన నివాసం వద్ద వెంకటాయగౌడ్‌ నగదును తీసుకున్నాడు. ఇదంతా ఏసీబీ అధికారులు చూస్తున్నారనే విషయాన్ని గ్రహించిన వెంకటాయ గౌడ్‌.. వెంటనే తన ఇంట్లోకి వెళ్లి గ్యాస్ స్టౌవ్‌పై లంచంగా తీసుకున్న రూ.6 లక్షల నగదును కాల్చివేశాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని తహసీల్దార్‌ సైదులు నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.