శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (22:35 IST)

ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వ‌రకు శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య 518వ వ‌ర్ధంతి ఉత్సవాలు

పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి  518వ వ‌ర్ధంతి ఉత్సవాలు ఏప్రిల్ 7 నుండి 11వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతి కళాక్షేత్రంలో, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద జ‌రుగ‌నున్నాయి. కోవిడ్ - 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వ‌హిస్తారు. అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య సింగ‌రాజు ద‌క్షిణా‌మూర్తి శ‌ర్మ ఈ కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

తిరుప‌తిలో...
ఏప్రిల్‌ 7వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు. ఏప్రిల్ 8న సాయంత్రం 6 గంటలకు తిరుమల నారాయణగిరి ఉద్యానవనానికి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వేంచేపుచేసి స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు.

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఏప్రిల్ 8న ఉద‌యం 9 గంట‌ల నుండి దిన‌ము ద్వాద‌శి, స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 9, 10వ తేదీల్లో ఉద‌యం 10.30 నుండి గంట‌ల నుండి సాహితీ స‌ద‌స్సులు జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 11న ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆస్థానం, సంగీత స‌భలు నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి ఆడిటోరియంలో ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సంగీత స‌భ‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ కార్యక్రమాల్లో సుప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారులు పాల్గొననున్నారు.      
 
తాళ్ల‌పాక‌లో...
తాళ్లపాకలోని ధ్యానమందిరం వ‌ద్ద ఏప్రిల్ 8న ఉద‌యం 9 గంట‌లకు దిన‌ము ద్వాద‌శి, స‌ప్త‌గిరి సంకీర్త‌న‌ల‌ గోష్టిగానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 8 నుండి 11వ తేదీ వ‌ర‌కు తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు సంగీతం, హ‌రిక‌థ కార్యక్రమాలు జరుగనున్నాయి.