1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:57 IST)

రెవెన్యూ అధికారుల నిర్వాహకం.. ప్రైవేటు వ్యక్తులకు శ్మశానవాటిక రిజిస్ట్రేషన్

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా మానవపాడు మండలంలో రెవెన్యూ అధికారులు ఓ వింత చర్యకు పాల్పడ్డారు. ఓ శ్మశానవాటికను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో జరిగింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓవైపు అసైన్డ్​ భూములనే కారణంతో రైతుల నుంచి పచ్చని పంట పొలాలను సైతం గుంజుకొని శ్మశానవాటికలను నిర్మిస్తున్న రెవెన్యూ ఆఫీసర్లు, ఈ గ్రామంలో ఏకంగా శ్మశానవాటికనే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్​ చేయడం గమనార్హం. 
 
పెద్దపోతులపాడు గ్రామంలోని సర్వే నంబర్ 9/ఏ/1లో 5.20 ఎకరాల భూమిలో కొన్నేండ్లుగా శ్మశానం ఉంది. కొన్ని దశాబ్దాల కిందే రుక్మిణమ్మ అనే మహిళ ఈ భూమిని శ్మశానానికి దానం చేశారు. అది శ్మశానం అనే తప్ప గతంలో దానంగా ఇచ్చిన భూమి అనే విషయం చాలామందికి తెలియదు. చాలా ఏండ్లుగా  గ్రామస్తులు ఎవరు చనిపోయినా ఈ శ్మశానంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 
 
ఇటీవల ఆ స్థలంపై రుక్మిణమ్మ వారసుల కన్నుపడింది. శ్మశానం కావడంతో సర్వే నంబర్ 9/ఏ/1ని ఇన్నాళ్లూ హోల్డ్​లో పెట్టారు. దీనిని రిజిస్ట్రేషన్​చేయడానికి వీలులేదు. అలాంటిది ఆఫీసర్ల సహకారంతో గత ఆగస్టు నెలలో 5.20  ఎకరాల భూమిని బెలగంటి మణివర్ధన్​రెడ్డి, గుమ్మా రెడ్డి పల్లె కృష్ణవేణి, మల్లెపల్లి వెంకటేశ్వరమ్మ, యాగంటి హైమావతి, సాంబయ్యగారి రమాదేవి పేర్లపై రిజిస్ట్రేషన్​చేయించుకున్నారు. 
 
తర్వాత వీరిలో ఒకరైన సాంబయ్యగారి రమాదేవి తన పేరుమీద ఉన్న 30 గుంటల స్థలాన్ని సింగవరం దివాకర్ రెడ్డికి సెప్టెంబర్ ​4న  రిజిస్ట్రేషన్ చేశారు. తీరా విషయం బయటకు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శ్మశానవాటిక కోసం ఏనాడో రాసిచ్చిన స్థలాన్ని ఎవరికీ తెలియకుండా రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారసులు, వారికి సహకరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.