1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (10:35 IST)

తెలంగాణలో ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రారంభం

eamcet
తెలంగాణలో ఎంసెట్-2023 ప్రవేశాల కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. సోమవారం నుంచి జులై 5 వరకు విద్యార్థులు రుసుం చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. 
 
అభ్యర్థులు 28 నుంచి జులై 8 వరకు కళాశాలల్లో సీట్ల ఎంపికపై ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రవేశాలు, కోర్సులు, సీట్ల వివరాలు, కౌన్సెలింగ్ ప్రక్రియ, నోటిఫికేషన్, సహాయ కేంద్రాల సమాచారాన్ని https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని కన్వీనర్ వెల్లడించారు. 
 
కాగా, తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికిగాను పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత కౌన్సెలింగులో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. మొత్తం 116 కళాశాలల్లో 29,396 సీట్లకు గాను 21,367 సీట్లను భర్తీ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో 87.44 శాతం, ప్రైవేటు కళాశాలల్లో 60.46 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 
 
సైబర్ సెక్యూరిటీ డిప్లొమా కోర్సుకు సంబంధించి మొత్తం సీట్లు భర్తీ కాగా, జౌళి సాంకేతిక డిప్లొమా కోర్సులో 64 సీట్లకు గాను కేవలం 9 మంది విద్యార్థులే చేరారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంకా 1,673, ప్రైవేటు కళాశాలల్లో 6,356 చొప్పున మొత్తం 8,029 సీట్లు ఖాళీగా ఉన్నాయని పాలిసెట్ కన్వీనర్ తెలిపారు. 
 
ఎన్సీసీ, క్రీడల కోటా సీట్లను తుది విడత కౌన్సెలింగ్ అనంతరం కేటాయిస్తామని సీట్లు పొందిన విద్యార్థులు జులై 7 నుంచి 10 వరకు తమ కేటాయించిన కళాశాలల్లో చేరాలని, చేరని వారి సీట్లను రద్దుచేస్తామని తెలిపారు. కళాశాలల్లో జులై 7 నుంచి 14 వరకు పునశ్చరణ జరుగుతుందని, 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.