ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (20:51 IST)

చిరంజీవిని మంచు ఫ్యామిలీ సభ్యులు ఎందుకు కలుస్తున్నారు?

మెగాస్టార్ చిరంజీవి ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు పాత్రను ఇపుడు చిరంజీవి భర్తీ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఏ సమస్య ఉత్పన్నమైనా.. దాన్ని చిరంజీవి ముందుండి పరిష్కరిస్తున్నారు. అందుకే చిత్రపరిశ్రమలకు చెందిన వారికి ఏ సమస్య వచ్చినా నేరుగా చిరంజీవి వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఇపుడు తాజాగా మంచు ఫ్యామిలీకి చెందిన సభ్యులు కలుస్తున్నారు. బుధవారం ఉదంయ మంచు విష్ణు కలవగా, సాయంత్రం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలిశారు. ఇది ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
నిజానికి చిరంజీవి, మోహన్ బాబు‌లు ఇద్ద‌రూ చిర‌కాల మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. హైద‌రాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. బుధ‌వారం మోహ‌న్‌బాబు 'ఆచార్య' సెట్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు. 
 
చిర‌కాల మిత్రుడు త‌న సినిమా సెట్స్‌కు రావ‌డంతో చిరంజీవి ఆనందంతో మోహ‌న్‌బాబును ఆహ్వానించారు. ఈ ఇద్ద‌రూ కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. మోహ‌న్‌బాబు ప్ర‌స్తుతం 'స‌న్ ఆఫ్ ఇండియా' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 
 
అయితే మంగళవారం మోహన్‌ బాబు తనయుడు మంచు విష్ణు కూడా చిరంజీవిని కలుసుకున్నట్లుగా తెలుపుతూ.. ఓ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈరోజు(బుధవారం) మోహన్‌ బాబు కూడా చిరును కలుసుకోవడం చూస్తుంటే.. మంచు ఫ్యామిలీ ఏదో భారీగానే ప్లాన్‌ చేస్తున్నట్లుగా టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.