1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (09:07 IST)

నాయకులారా తస్మాత్ జాగ్రత్త.. నాలుక తెగ్గోస్తాం... మీసం మెలేసిన పోలీస్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఘాటైన హెచ్చరిక చేసింది. పోలీసులను, పోలీసు వ్యవస్థను కించపరిస్తే నాలుక తెగ్గోస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఘాటైన హెచ్చరిక చేసింది. పోలీసులను, పోలీసు వ్యవస్థను కించపరిస్తే నాలుక తెగ్గోస్తాం.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అనంతపురం జిల్లాలో ప్రభోదానంద ఆశ్రమ వివాదం విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సిగ్గులేని పోలీసులు, నిర్వీర్యమైన వ్యవస్థ, ఉన్నట్టా చచ్చిపోయినట్లా అని జేసీ ఇటీవల మండిపడ్డారు. అంతేకాదు... 'మీరు ఇంతే' అనేలా పోలీసుల ముందు హిజ్రాలతో నృత్యాలు చేయించారు.
 
ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయింది. అనంతపురంలో గురువారం సంఘం జిల్లా అధ్యక్షుడు సాకే త్రిలోకనాథ్‌, కార్యదర్శి గోరంట్ల మాధవ్‌, సంయుక్త కార్యదర్శి సూర్యకుమార్‌ మీడియాతో మాట్లాడారు. 'ఇటీవల పార్టీలకు అతీతంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు పోలీసు వ్యవస్థ స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారు. నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని ఒంటిచేత్తో అణచివేశాం. ఆ విషయం మరిచిపోవద్దు. ఇన్నాళ్లు సంయమనం పాటించాం. ఇకపై సహించేది లేదు. అదుపు తప్పి మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం' అంటూ గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు.
 
అంతేకాకుండా, పోలీసులను హిజ్రాలతో పోల్చుతూ నృత్యాలు చేయించడంపై ఆయన ఒకింత ఘాటుగా స్పందించారు. 'మేమూ రాయలసీమ బిడ్డలమే. మాకూ పౌరుషం ఉంది. మగాళ్లం కాబట్టే పోలీసు వ్యవస్థలోకి వచ్చాం. ఈ వ్యవస్థలో పని చేస్తున్నాం! అని మీసం మెలేసి చెప్పారు. నాయకులారా.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పైగా, తమను హిజ్రాలతో పోల్చిన వారికి ఇదే తమ సమాధానమని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.