1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Andhra Pradesh Govt to issue notification to form new districts

ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాలు?

Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నరేళ్లుగా అనేక ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు. వీటిని సంక్షేమ పథకాల రూపంలో పేదలకు పప్పుబెల్లంలా పంచిపెట్టారు. ఇపుడు అప్పులు చేయకుంటే రాష్ట్రానికి పూటగడవని పరిస్థితి నెలకొంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వేతనాలు చెల్లించలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం కన్నెర్రజేసింది. 
 
ఇదిలావుంటే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలంతా సంఘటితమయ్యారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్టు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు నోటీసు కూడా ఇచ్చారు. ఇంకోవైపు, గుడివాడ క్యాసినో వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అదేసమయంలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా పెరిగిపోతుంది. 
 
ఈ సమస్యలతోపాటు కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని తొలుత ప్రైవేటు పరం చేసి ఆ తర్వాత ఆదాని గ్రూపునకు అమ్మాలని ప్రభుత్వం ఎత్తుగడ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యుత్ కేంద్రం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అలాగే, విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యేడాదిగా ఉద్యమం జరుగుతుంది. 
 
ఏకంగా 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ అధికార పార్టీ ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి వుంది. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన కీలక నేత విజయసాయి రెడ్డిలు పలు కేసుల్లో ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. పైగా వీరిద్దరూ ప్రస్తుతం కోర్టు బెయిల్‌పై కాలం వెళ్ళదీస్తున్నారు. 
 
ఇలా ఒకవైపు, ఆర్థిక కష్టాలు, మరోవై ప్రభుత్వ ఉద్యోగుల సమస్య, కరోనా, క్యాసినో ఇలా అన్ని సమస్యలు చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు.. ఒక్క లోక్‌సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా చేయనున్నారు. అలాగే, అదనంగా మరో జిల్లాతో మొత్తం 26 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేయాలని, ఆ దిశకా కసరత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
ఫలితంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం చిత్రూ జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ఈ కొత్త జిల్లాల కోసం నియోజకవర్గాలను విభజించాల్సివుంటుంది. సరిహద్దులను మార్చాల్సివుంటుంది. అలా చేయడం వల్ల కొందరు ప్రజలు వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఇపుడున్న సమస్యల నుంచి ప్రజల దృష్టి అటువైపు మరలుతుంది. దీంతో పాత సమస్యలు మరుగునపడిపోయేలా సీఎం జగన్ వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేశంలో 3 లక్షలకు దిగువకు కరోనా పాజిటివ్ కేసులు