1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (14:12 IST)

ఉద్యోగుల జీతం తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంది : ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వేతనాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. పైగా, పీఆర్సీ పర్సెంటేజీని సవాల్ చేసే హక్కు ఉద్యోగ సంఘాలకు లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త పీఆర్సీని ప్రకటించింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గాయి. ఈ పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల వేతనాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టంచేసింది. 
 
అయితే, హెచ్ఆర్ఏ విభజన చట్టం ప్రకారం జరగలేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. అయితే, ఈ ఆరోపణలతో హైకోర్టు ఏకీభవించలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందా? తగ్గిందా? అనేది చెప్పాలని కోర్టు అడిగింది. మీకు ఎంత ఎంత జీతం తగ్గిందో చెప్పాలని, అంకెల్లో ఈ లెక్కలు అందజేయాలని వ్యాఖ్యానించింది. 
 
పైగా, పూర్తి డేటా లేకుండా కోర్టుకు ఎలా వస్తారని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్‌కు చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. అదేసమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హాజరై తన వాదనలు వినిపించారు. ఉద్యోగుల గ్రూపు వేతనం పెరిగిందని కోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన లెక్కలను కూడా అందించారు.