1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (10:03 IST)

కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న వైకాపా ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా ఉంది. ప్రతి రోజూ పది వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ బారిన సామాన్యుల నుంచి సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు, వీవీఐపీలు పడుతున్నారు. తాజాగా ఏపీలోని అధికార వైకాపాకు చెందిన ఇద్దరు ఎంపీలు కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. వీరిలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,440 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, విశాఖపట్టణంలో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. 
 
ఇక్కడ వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు పైగా వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 2,258 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఓ కోవిడ్ బాధితుడు కన్నుమూశారు. ఈ కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం విశాఖలో 15,695 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో ఏకంగా 46,650 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 14,440 మందికి ఈ వైరస్ సోకింది. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1,534, గుంటూరులో 1,458, ప్రకాశం జిల్లాలో 1,399, కర్నూలు జిల్లాలో 1,238 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 3,969 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,80,634 మందికి కరోనా వైరస్ సోకగా, 2082482 మంది కోలుకున్నారు. మరో 83610 మంది చికిత్స పొందుతున్నారు.