శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (11:33 IST)

కయ్యానికి కాలు దువ్వుతున్నారు... కనుసైగ చేస్తే చాలు.. : బిపిన్ రావత్

దాయాది దేశం పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతున్నారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. అయితే, తాము సిద్ధంగానే ఉన్నామనీ, కనుసైగ చేస్తే తమ బలగాలు దూసుకెళ్తాయని చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ కాశ్మీరీలు జిహాద్‌ (పవిత్ర యుద్ధం) చేస్తున్నారని, పాకిస్థాన్‌ వారికి అండగా ఉంటే వారు విజయం సాధిస్తారన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మండిపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ దాగుడుమూతలు ఆడుతోందన్నారు. ఇటువంటి చర్యలు ఎల్లకాలం సాగవని, మెరుపుదాడులతో భారత్‌ ఏంటో ఆ దేశానికి ఇప్పటికే తెలిసి వచ్చిందని గుర్తుచేశారు. 
 
పాకిస్థాన్‌ హద్దు మీరి ప్రవర్తిస్తే భారత్‌ సరిహద్దు దాటడానికి వెనుకడుగు వేయదని హెచ్చరించారు. భూ, వాయు మార్గాల్లో దాడు చేసి ఆ దేశానికి బుద్ధి చెబుతామన్నారు. యుద్ధం అంటే వస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. పైగా, తమ బలగాలు ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు.