శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:04 IST)

విక్రమ్ హార్డ్ ల్యాండింగ్.. అక్టోబరులో గుర్తిస్తాం : నాసా

చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2లో పంపించిన విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అయినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్పష్టం చేసింది. ఈ నెల 17న తమ ఆర్బిటార్‌ (రికానిసెన్స్‌) తీసిన ఫొటోలను నాసా విశ్లేషించి.. శుక్రవారం విడుదల చేసింది. 
 
రికానిసెన్స్‌ ఆ ప్రదేశాన్ని చేరిన సమయంలో చంద్రుడిపై చీకటి ఉండటం వల్ల విక్రమ్‌ ఉనికిని గుర్తించలేకపోయింది. అక్టోబరు 14న రికానిసెన్స్‌ మరోమారు తన కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి ధ్రువ ప్రాంతానికి వెళ్తుందని.. ఆ సమయంలో చంద్రుడిపై వెలుగు ఉంటుందని.. అప్పుడు విక్రమ్‌కు సంబంధించి స్పష్టమైన చిత్రాలు లభించే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది. 
 
నిజానికి షెడ్యూల్‌ ప్రకారం విక్రమ్‌ ల్యాండర్‌ ఈ నెల 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువానికి 600 కి.మీ. దూరంలో ఉన్న సింపెలియస్‌-ఎన్‌, మాంజినస్‌-సీ అఖాతాల మధ్యలోని చదునైన ప్రాంతంపై దిగాల్సి ఉన్నది. అయితే చివరి క్షణంలో ల్యాండర్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
 
'విక్రమ్‌ హార్డ్‌ ల్యాండింగ్‌ అయ్యింది. అయితే అది ఎక్కడున్నదో ప్రస్తుతానికి ఖచ్చితంగా గుర్తించలేకపోయాం' అని అమెరికా నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ సంస్థ ప్రకటించింది. ఎల్‌ఆర్వోసీ అక్టోబర్‌ 14న విక్రమ్‌ కూలిన ప్రాంతం మీదుగా వెళ్తుందన్నారు. వెలుతురు ఉన్న ఆ సమయంలో ఫొటోలు తీస్తే విక్రమ్‌ పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉండవచ్చని తెలిపారు.