గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (10:58 IST)

దేశంలో మరో 9 వేల కరోనా కేసులు ... 2 లక్షల మంది చనిపోతారట..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 357 మంది కరోనాతో మరణించారు.
 
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,86,579కి చేరగా, మృతుల సంఖ్య 8,102కి చేరుకుంది. 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకున్నారు.
 
ఇదిలావుంటే, అమెరికాలో సెప్టెంబరు నాటికి కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మంది చనిపోతారంటూ హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణుడు ఆశిష్ ఝా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రపంచం మేల్కొని కరోనా వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోకుంటే ఇది ఖాయమని ఆయన హెచ్చరించారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 1,12,754 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా రోగులను క్వారంటైన్ చేయడం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్కులను ధరించడం ద్వారా మరణాల సంఖ్యను నిరోధించవచ్చని ఆశిష్ పేర్కొన్నారు. 
 
తాజాగా, న్యూమెక్సికో, ఉటా, అరిజోనా, ఫ్లోరిడా, ఆర్కాన్సాస్‌లలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో వ్యాపార, సామాజిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.