శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (08:38 IST)

మహారాష్ట్రలో కరోనా మరణ మృదంగం .. ఒక్క రోజే 149 మంది మృత్యువాత

మహారాష్ట్రలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఫలితంగా ఈ రాష్ట్రంలో కరోన వైరస్ మరణ మృదంగం కొనసాగుతోంది. బుధవారం ఒక్క రోజే ఏకంగా 149 మందిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,438 మరణాలు నమోదయ్యాయి. 
 
ఇకపోతే, బుధవారం ఒక్క రోజే 3,254 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 94,041కు చేరుకుంది. అలాగే, బుధవారం 1,879 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,517కి పెరిగింది.
 
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 15,384 శాంపిళ్లను పరీక్షించగా మరో 136 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 72 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,126 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,573 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,475మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 78కి చేరింది.
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఒక్క రోజే ఏకంగా 191 కేసులు నమోదయ్యాయి. అలాగే, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,111కి చేరుకోగా, 156 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వెలుగు చూసిన వాటిలో 143 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
మేడ్చల్‌, సంగారెడ్డిలో 11 చొప్పున, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో మూడు చొప్పున కేసులు నమోదు కాగా, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లో రెండేసి, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్ధిపేటలో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,817 మంది డిశ్చార్జ్ కాగా, 2,138 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.