శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (12:50 IST)

కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.10 లక్షలు ఇస్తారు.. ఎక్కడంటే?

marriage
కులాంతర, మతాంతర వివాహాలు వివాదాస్పదంగా, ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో, రాజస్థాన్ ప్రభుత్వం కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించింది. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ఇప్పుడు రూ. 10 లక్షల ప్రోత్సాహకం అందుకుంటారు, ఇది గతంలో రూ. 5 లక్షల ప్రోత్సాహకంగా వుండగా దానిని రెట్టింపు చేస్తున్నట్లు రాజస్థాన్ సర్కారు ప్రకటించింది. 
 
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల 2023-24 బడ్జెట్‌లో దీనిని ప్రకటించారు. సవితా బెన్ అంబేద్కర్ కులాంతర వివాహ పథకాన్ని సవరించారు. డాక్టర్ సవితా బెన్ అంబేద్కర్ కులాంతర వివాహ పథకం కింద రూ.5 లక్షలు ఎనిమిదేళ్లపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉంచగా, మిగిలిన రూ.5 లక్షలు నవ వధువుల ఉమ్మడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 
 
2006లో ప్రారంభించిన ఈ పథకం మొదట్లో రూ.50,000 అందించగా, ఆ తర్వాత ఏప్రిల్ 2013లో రూ.5 లక్షలకు పెంచారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకానికి నిధులు సమకూరుస్తాయి. ఇందులో 75 శాతం రాష్ట్రం మిగిలిన 25 శాతం కేంద్రం భరిస్తుంది.
 
గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ప్రభుత్వం రూ.33.55 కోట్లు విడుదల చేయగా ప్రస్తుత ఏడాది రూ.4.5 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. 
 
ప్రోత్సాహకం పొందేందుకు షరతులు
పథకం ప్రకారం, కులాంతర వివాహం 35 సంవత్సరాల వరకు మాత్రమే అనుమతించబడుతుంది. జంటకు ప్రోత్సాహక డబ్బులో సగం మాత్రమే అందిస్తారు. 
 
మిగిలిన మొత్తం జాతీయ బ్యాంకులో జాయింట్ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా ఉంచబడుతుంది. పెళ్లయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత మాత్రమే క్లెయిమ్ చేయబడుతుంది.