గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (12:26 IST)

ఇమ్రాన్‌ ఖాన్‌ను చంపాలి లేదా మేమైనా చావాలి : పాకిస్థాన్ మంత్రి

imran khan
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఆ దేశ మాజీ ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ గురించి  పాకిస్థాన్ మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి శత్రువుగా మారిన ఇమ్రాన్ ఖాన్‍‌ను చంపాలి లేదా మేమైనా చావాలి అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ ప్రైవేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్ అధికార పార్టీకి శత్రువుగా మారారు. ఇప్పుడు ఆయనైనా హత్యకు గురవ్వాలి లేదా తామైనా చచ్చిపోయే పరిస్థితి ఉందంటూ మంత్రి రానా సనావుల్లా తీవ్రస్థాయిలో స్పందించారు. 
 
'ఇమ్రాన్‌ ఖాన్‌ అయినా.. లేదా మేమైనా చావాలి. పీటీఐ లేదా పీఎంఎల్‌ఎన్‌ పార్టీ.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండే స్థితికి ఇమ్రాన్ దేశ రాజకీయాలను దిగజార్చారు. పీఎంఎల్ఎన్‌ ఉనికి ప్రమాదంలో ఉంది. మా పార్టీని రక్షించుకునేందుకు మేం ఎంతవరకైనా వెళ్తాం. ఇమ్రాన్‌ రాజకీయాలను శత్రుత్వంగా మార్చారు. ఆయనే ఇప్పుడు మా శత్రువు. మేం ఆయన్ను అలాగే చూస్తాం' అని హెచ్చారించారు. ఈ వ్యాఖ్యలు అరాచకత్వానికి దారితీస్తాయేమోనని విలేకరి ఆందోళన వ్యక్తం చేయగా.. 'ఇప్పటికే పాకిస్థాన్‌లో అరాచకత్వం ఉంది' అని మంత్రి సమాధానమిచ్చారు. 
 
అయితే, ఈ వ్యాఖ్యలపై ఇమ్రాన్ పార్టీ నేతలు ఘాటుగానే స్పందించారు. 'అధికార సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రాణాపాయం ఉంది. వారు నేరుగా హత్య బెదిరింపులకు దిగారు. ఇమ్రాన్‌పై హత్యకు కుట్ర గురించి ఎవరికైనా అనుమానం ఉంటే.. సనావుల్లా చేసిన బెదింపులు గమనించాలి. ఒక అధికార పార్టీ ఇలా బహిరంగ బెదిరింపులకు దిగడం గతంలో ఎన్నడూ చూడలేదు' అంటూ మండిపడ్డారు.