గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (09:05 IST)

మే 17 లేదా 18న కర్ణాటక సీఎంగా ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా జరగనేలేదు. ఓటింగ్ ఇంకా 12 రోజులు ఉన్నాయి. మే నెల 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా జరగనేలేదు. ఓటింగ్ ఇంకా 12 రోజులు ఉన్నాయి. మే నెల 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. 15వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
 
ఇలా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగానే తామే కాబోయే సీఎంలమంటూ ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. అంతేనా, ఏకంగా ప్రమాణ స్వీకార ముహూర్తాలు పెట్టేసుకున్నారు. వారు ఏం చెప్పారో చూద్దాం.. తమతమ ప్రమాణ స్వీకారాలపై యడ్యూరప్ప (బీజేపీ,), సిద్ధరామయ్య (కాంగ్రెస్), కుమార స్వామి (జేడీఎస్)లు ఏమంటున్నారో తెలుసుకుందాం. 
 
బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప స్పందిస్తూ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడం, బీజేపీ గెలవడం తథ్యం. నేను మే 17 లేదా 18వ తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ, లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మద్దతుదారుల సమక్షంలో సీఎంగా బాధ్యతలు చేపడుతానంటూ ప్రకటించారు. 
 
ఇకపోతే, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ, చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తా. మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. ఫలితాల అనంతరం వారంలోగా నేనే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ ప్రకటించారు.

అలాగే, జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమారస్వామి కూడా ఇదే తరహా ధీమాను వ్యక్తం చేశారు. 'మా జేడీఎస్‌ పార్టీ జయకేతనం ఎగురవేయటం ఖాయం. మే 18న మా నాన్న హెచ్‌డీ దేవెగౌడ జన్మదినం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా తండ్రికి బహుమతిగా ఇస్తా' అంటూ వ్యాఖ్యానించారు.