1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (11:04 IST)

హిజాబ్‌పై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు

దేశంలో తీవ్ర చర్చకు దారితీసిన హిజాబ్ వ్యవహారంలో కర్నాటక రాష్ట్ర హైకోర్టు మంగళవారం సంచలనం తీర్పును వెలువరించింది. ముస్లిం సంప్రదాయంలో హిజాబ్ తప్పనిసరికాదని పేర్కొంది. విద్యా సంస్థల్లో యూనిఫాంలను సమర్థించింది. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరికాదని స్పష్టం చేస్తూ, హిజాబ్‌ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 
 
విద్యార్థులు ఎవరైనా స్కూల్ యూనిఫాంలు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. హిజాబ్‌ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్లపై 11 రోజుల పాటు సుధీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. 
 
కాగా, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఎలా ఉంటుందోనన్న సర్వత్రా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. అయితే, తీర్పుతో నిమిత్తం లేకుండా ఇరు వర్గాలను అదుపు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. 
 
సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించింది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే పలు ఆంక్షలను విధించింది. మరోవైపు, హిజాబ్ వివాదం రేగిన దక్షిణ కన్నడ జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. మంగళవారం జరుగనున్న పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాలని అన్ని విద్యా సంస్థలను ఆయన కోరారు. 
 
హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగుళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఒక వారం రోజుల పాటు బెంగుళూరు నగరంలో ఎలాంటి సమావేశాలుగానీ, నిరసనలు గానీ, జనం గుమికూడటానికిగానీ అనుమతించబోమని ఓ ప్రకటనలో వెల్లడించారు.