1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Karunanidhi no more

అస్తమించిన ద్రవిడ సూర్యుడు...

తమిళ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత 'కలైంజ్ఞర్' కరుణానిధి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు చెన్నైలోని కావేరి హాస్పిటల్

Karunanidhi no more
తమిళ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత 'కలైంజ్ఞర్' కరుణానిధి తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
 
మూత్రనాళం ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలం ఇంట్లోనే చికిత్స జరిగింది. ఆ తర్వాత బీపీ పల్స్ తగ్గిపోవడంతో చెన్నై నగరంలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. 
 
ఇక్కడ గత 11 రోజులుగా చికిత్స పొందుతూ వచ్చారు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన హాస్పిటల్ వర్గాలు.. మంగళవారం సాయంత్రం 6:10 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ప్రకటించాయి.  కరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన వయస్సు 94 ఏళ్లు. 
 
కరుణానిధి 1924 జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు. ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆయన చిన్నకుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు.
 
రాత్రి 9 గంటల సమయంలో కావేరి ఆసుపత్రి నుంచి గోపాలపురంలోని నివాసానికి కరుణానిధి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో తరలించారు. భౌతికకాయం వెంట కరుణానిధి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నారు. కావేరి ఆసుపత్రి, గోపాలపురంలోని నివాసం వద్ద డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 
 
తమ అభిమాన నేత కరుణానిధి మృతిని జీర్ణించుకోలేని అభిమానుల రోదనలు మిన్నంటున్నాయి. కావేరి ఆసుపత్రి వద్ద, గోపాలపురంలోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 
 
మరోవైపు, అన్నాదురై సమాధి వద్దే కరుణానిధిని ఖననం చేస్తామన్న ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే నేతల విఙ్ఞప్తిపై తమిళనాడు  ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెప్పడంపై డీఎంకే నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 
About Writer
pnr
తర్వాతి కథనం
ప్రియతమ నేత ప్రశాంతంగా సాగునంపుదాం.. స్టాలిన్ పిలుపు