శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (17:53 IST)

ముగిసిన పోలింగ్ : హుజూర్ నగర్‌లో ఓటర్ల మూడ్ ఏంటి?

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే, ఐదు గంటల లోపు వచ్చి వరుసలో నిలబడినవారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పోలింగ్ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు,పోలింగ్ ముగిసే సమయానికి హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల 80 శాతానికి పైగా నమోదైంది. మొత్తం నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటికే లైన్‌లో నిలబడి ఉన్నవారంతా ఓటు హక్కు వినియోగించుకుంటే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది. ఇక 2014లో 81.14 శాతం, 2018లో 85.96 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా ఈ ఉపఎన్నికలో కూడా అంతే స్ధాయిలో నమోదయ్యే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. పైగా, ఈ అసెంబ్లీ స్థానం ఓటర్ల మూడ్ మాత్రం విపక్ష పార్టీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. 
 
మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానానికి ఉన్న 288 సీట్లతో పాటు.. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా, మహారాష్ట్రలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బాలీవుడ్ సెలెబ్రిటీలు, ప్రముఖులు క్యూకట్టారు. పైగా, ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రధాని మోడీతో పాటు.. పార్టీ చీఫ్ అమిత్ షాలు సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే.