శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (15:53 IST)

భారత్‌లో అక్రమవలసదారులను గెంటేస్తాం : అమిత్ షా

భారత్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోమారు ప్రకటించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎన్.ఆర్.సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ని అమలు చేయనున్నట్టు తెలిపారు. ఎన్.ఆర్.సిని ఇప్పటికే అస్సోం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటేస్తామని తెలిపారు. ఇందుకోసం ఎన్.ఆర్.సిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసి తీరుతామన్నారు. 
 
ఇకపోతే, 'ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మెండుగా ఉంది. 2024లో మరోసారి ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం. కానీ ఆ లోపే బీజేపీ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించి వేస్తుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ అక్రమ వలసదారులు మన ప్రజలకు అందుతున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ధైర్యంగా ఉంటున్నారన్నారు. 
 
బీజేపీ, మోడీ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక మీదట ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండబోరు అని స్పష్టం చేశారు. అలానే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, అక్రమ వలసదారుల గెంటివేత వంటివి దేశానికి మేలు చేసే అంశాలని.. కానీ అవి కాంగ్రెస్‌కు రుచించడం లేదని అమిత్‌ షా మండిపడ్డారు.