మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (17:42 IST)

దమ్ములేని మోడీ సర్కారు... లోక్‌సభ ప్రతిష్టంభనపై కమలనాథులు చిరునవ్వులు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కారుకు దమ్ము లేదా? అంటే లేదనే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే.. గత 13 రోజులుగా లోక్‌సభలో ప్రతిష్టంభన నెలకొన్నా.. సభను ఎదుర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సర్కారుకు దమ్ము లేదా? అంటే లేదనే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే.. గత 13 రోజులుగా లోక్‌సభలో ప్రతిష్టంభన నెలకొన్నా.. సభను ఎదుర్కొనే ధైర్యం నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో ఏమాత్రం కనపడటం లేదని వారు ఆరోపిస్తున్నారు. 
 
ముఖ్యంగా, వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తమతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన గళం వినిపిస్తున్నారు. స్పీకర్ పోడియంలను చుట్టుముట్టి రభస చేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఉభయసభలు ప్రతి రోజూ వాయిదాపడుతూ వస్తున్నాయే గానీ, సభలో ఆందోళన చేస్తున్న ఎంపీలను వారించే నాయుకుడు ఒక్కడంటే ఒక్కరూ కనిపించడం లేదు. 
 
ముఖ్యంగా, అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ ఎంపీలను ప్రతి రోజూ దూసుకువస్తున్నా.. వారిని బుజ్జగించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నిజానికి అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని, అయితే తమ రాష్ట్రాల సమస్యలు ముఖ్యమని, హామీ ఇస్తే తాము నిరసనలను ఆపుతామని అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, స్పీకర్‌ సుమిత్రా మహజన్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌లను వారు కలుసుకున్నప్పుడల్లా ఇదే చెబుతున్నారు.
 
తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్ణయించాల్సి ఉందని వారు చెప్పుకొచ్చారు. అమిత్‌ షా... అనంతకుమార్‌ గదిలో రోజంతా కూర్చుని సభలో పరిణామాలను చిరునవ్వుతో వీక్షిస్తూ ఉండిపోతున్నారు. మోడీ కూడా పార్టీ నేతలను, వచ్చిన ప్రతినిధి వర్గాలను కలుసుకుంటున్నా.. సభ ప్రతిష్టంభన గురించి మాత్రం మాట్లాడడం లేదు. 
 
వీరి నోటి నుంచి పార్లమెంట్‌ను సజావుగా నడిపించేందుకు ఏదైనా సూచనలు వస్తాయేమో అని చూస్తున్న బీజేపీ నేతలకు నిరాశే ఎదురవుతోంది. పార్టీ చీఫ్‌ విప్‌గా రాకేశ్‌ సింగ్‌కు కూడా ఎలాంటి సంకేతాలు మోదీ, అమిత్‌ షా ఇవ్వడం లేదు. శుక్రవారం నాటికి చెబుతామని రాకేశ్‌తో అమిత్‌ షా అన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.