బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (16:59 IST)

నేను మూడు పెళ్లి చేసుకోవడం వల్లే జైలుకెళ్లారా జగన్ గారూ? పవన్ కళ్యాణ్ ప్రశ్న

నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు జైలుకెళ్లారా జగన్ గారూ అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. పవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం మాటలు చూస్తుంటే వంటికి టెన్ థౌజండ్ వాలా టపాసులు చుట్టుకుని, మిగతా 150 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా టెన్ థౌజండ్ వాలా టపాసులు చుట్టి పేల్చుతున్నట్టుగా ఉందన్నారు. ఇది అందరికీ ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. అందరూ కాలిపోతారు జాగ్రత్త అని పవన్ హెచ్చరించారు. 
 
జగన్‌గారూ ఎలా పడితే అలా మాట్లాడొద్దు, పద్ధతిగా మాట్లాడితే మంచిదని అన్నారు. జగన్‌ను చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాము శివుడి మెడలో ఉన్నంత వరకే గౌరవం అని, ఒక్కసారి జగన్ రెడ్డి పరిస్థితి తారుమారైతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని హితవు పలికారు.
 
పైగా, 'నేనెప్పుడూ మీ వ్యక్తిగతంపై మాట్లాడలేదు. మిమ్మల్నే కాదు మీ ఎమ్మెల్యేలపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ ఓ స్థాయి దాటిందంటే మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసినవాడ్ని. అయితే సంయమనం పాటిస్తున్నాను' అంటూ ఘాటుగా హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, తనపై జగన్ చేసిన మూడు పెళ్లిళ్లు, ఐదుగురు పిల్లల వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. 'ఏం జగన్ రెడ్డి గారూ, నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు, విజయసాయిరెడ్డిగారూ కలిసి రెండు సంవత్సరాలు జైల్లో కూర్చున్నారా? అడిగిన దానికి సరిగా స్పందించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు' అంటూ కడిగిపారేశాడు. 
 
మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. వైసీపీ నేతల మాటల్ని భరించడానికి తాము టీడీపీ కాదని, జనసేన అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. జగన్‌ను ఓ కులంగా చూడమని, రాజకీయ నాయకుడిగానే చూస్తామన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని, ఇందుకోసం అమరజీవి పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. సీఎం జగన్‌కు అసలు చరిత్ర తెలుసా? అని సూటిగా ప్రశ్నించారు. తమిళనాడులో ఇంకా తెలుగు మీడియం ఉందని, టీచర్లకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించకుండా ఒకే సారి మారిస్తే ఎలా? అని మరోసారి ప్రశ్నించారు.
 
ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైసీపీ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్‌ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసని, ప్రజలపక్షానే నిలబడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 
 
అంతకుముందు... పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన బృందం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దాదాపుగా అరగంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. అటు ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.