శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (14:39 IST)

అయ్యా పవన్.. మీ ముగ్గురు భార్యలూ.. నలుగురో.. ఐదుగురో పిల్లలు.... సీఎం జగన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్... ప్రతిభావంతులకు పురస్కారాలు అందించారు. 
 
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం వద్దని పవన్ చెప్పడంపై విరుచుకుపడ్డారు. 'అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే, ఇవాళ, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనం. మన రాష్ట్రం నష్టపోతుంది. జాతి నష్టపోతుంది. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే, అతిగొప్ప ఆస్తి చదువు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి. ఏ పిల్లాడూ, తల్లీ అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే నా ఉద్దేశం' అని అన్నారు. 
 
డిసెంబరు నెలలో మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని, నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 40 వేల స్కూళ్లలో 15 వేల స్కూళ్లను మార్చనున్నామని, అందుకోసం 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. స్కూళ్లు ఇప్పుడెలా ఉన్నాయి? మారిపోయిన తర్వాత ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఫోటోలు తీసి అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. స్కూళ్లను మార్చి చూపిస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి శపథం చేశారు.