గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (10:28 IST)

మనిషికి పంది కిడ్నీ : ఆపరేషన్ సక్సెస్.. ఎక్కడ?

అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మనిషికి పంది కిడ్నీని అమర్చారు. తద్వారా వైద్య శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి విజయవంతంగా అమర్చగా, ఇది సాధారణంగా పని చేయడం గమనార్హం. 
 
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అవయవాల కొరత వేధిస్తోంది. ఇలాంటి ఆపరేషన్లు విజయవంతమైతే ఈ అవయవాల కొరతను సులభంగా అధికమించేందుకు ఈ పరిశోధనను కీలక ముందడుగుగా భావిస్తున్నారు. 
 
న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్‌ హెల్త్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు... బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తిపై గతనెలలో అవయవ మార్పిడి ప్రయోగం చేపట్టారు. పంది మూత్రపిండాన్ని అతనికి అమర్చి, మూడు రోజులపాటు దాని పనితీరును పరిశీలించారు. 
 
ఈ కిడ్నీ సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని శస్త్రచికిత్స నిర్వహించిన డా.రాబర్డ్‌ మోంట్గోమెరి తెలిపారు. నిజానికి పంది కణాల్లోని గ్లూకోజ్‌ మనిషి శరీర వ్యవస్థకు సరిపోలదు. 
 
దీంతో మనిషి రోగనిరోధక వ్యవస్థ ఈ అవయవాలను తిరస్కరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎన్‌వైయూ శాస్త్రవేత్తలు... జన్యు సవరణలు చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. దాని కణాల్లో చక్కెర స్థాయిలను తగ్గించి, మనిషి రోగ నిరోధక వ్యవస్థ తృణీకరించకుండా కొన్ని మార్పులు చేశారు. తర్వాత ఆ మూత్రపిండాన్ని మనిషికి విజయవంతంగా అమర్చారు. దీని పనితీరు సక్రంగా ఉండటం గమనార్హం.