శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి

పామును తింటే కరోనా చనిపోతుందట.. వీడియో వైరల్

కరోనాను జయించేందుకు రకరకాల వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నిజానికి అందులో చాలా వరకు కట్టుకథలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే.. వ్యూస్ కోసమో.. లేక మరేదో ప్రయోజనం కోసమో ఈ తరహా వీడియోలకు ఇంటర్నెట్‌లో కొదువే లేదు.
 
కాగా.. ఇప్పుడు ఏకంగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా పామును తింటే కరోనా రాదని తాను స్వయంగా పామును తింటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఈ వీడియోకు ఎక్కడలేని ప్రచారం వచ్చేసింది. పామును తింటే కరోనా సంగతేమో కానీ మరేదో రోగం వచ్చి ఏకంగా కైలాసానికి పోవడం ఖాయమని కాస్త లోకజ్ఞానం ఎరిగిన వారికి తెలియనిది కాదు.
 
అయితే.. ఈయన మాత్రం కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు ఈ పాములో పుష్కలంగా ఉన్నాయని.. అందుకే ఇది తింటే కరోనా రాదని వీడియోలో చెప్పాడు. ఆయనకి కరోనా రావడంలో ఈ పాము ఏ మాత్రం అడ్డుకోలేదని తెలిసిన అంశమే కాగా.. పోలీసులు మాత్రం ఈయన్ని అరెస్ట్ చేసి జరిమానా కూడా విధించేశారు. 
 
తమిళనాడు మదురై జిల్లాలోని పెరుమల్​పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే ఓ రైతు ఓ పామును తింటూ కరోనాకు దివ్యౌషధం అని చెప్పాడు. పామును వడివేలు తింటుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్​లో వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ఇది వైరల్​గా మారింది. ఇది కాస్త అటవీ అధికారులకు చేరడంతో అతనికి రూ.7 వేల రూపాయల జరిమానా విధించి హెచ్చరించి వదిలేశారు.