శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (09:22 IST)

World Sleep Day: నిద్ర తక్కువ.. రోగాలెక్కువ..

ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారు. మార్చి 19న జరుపుకునే ఈ నిద్ర దినోత్సవం సందర్భంగా ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసక్తికర సర్వేను వెలువరించింది. సమాజంలో రోజురోజుకు నిద్ర సంబంధిత రుగ్మతలు పెరిగిపోతున్నాయని పేర్కొంది. 
 
సర్వే ప్రకారం దాదాపు 47 శాతం మంది తగినంత నిద్ర పోవట్లేదని తెలిపింది. నిద్రలేమి వారి జీవితాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.
 
ఏఐజీ ఈఎన్‌టీ విభాగం డైరెక్టర్ డా.శ్రీనివాస్ కిశోర్ నిద్ర ప్రాముఖ్యతపై మాట్లాడుతూ.. 'నిద్ర అనేది విలాసవంతమైనది కాదు. గాలి, నీరు, ఆహారం లాగే మనుషులకు అదొక జీవ సంబంధమైన అవసరం. మనిషి తగినంత నిద్ర పోకపోతే అది అతని మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఎంతసేపు నిద్ర పోయామన్నది కూడా కాదు. ఎంత క్వాలిటీ నిద్ర అన్నదే ముఖ్యం.' అని పేర్కొన్నారు.
 
ఎంత గాఢంగా.. ఎలాంటి రిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతేనే ఆరోగ్యానికి మంచిదన్నారు. స్లీప్ డిజార్డర్స్‌ను అర్థం చేసుకోవడం చాలా అవసరమని.. ఎందుకంటే అవి గుండె సంబంధిత, న్యూరాలజికల్, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక ప్రవర్తనలో మార్పు, బరువు పెరగడం తదితర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని డా.శ్రీనివాస్ కిశోర్ అన్నారు.
 
మొత్తం 38 స్లీప్ డిజార్డర్స్‌లో అన్నింటికన్నా ఎక్కువ ఆందోళన కలిగించేది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ)గా పేర్కొన్నారు. దీని ద్వారా చాలా అనారోగ్య సమస్యలతో పాటు సకాలంలో చికిత్స అందకపోతే మరణం సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. హైవేలపై 40 శాతం రోడ్డు ప్రమాదాలు నిద్ర మత్తు కారణంగానే జరుగుతున్నాయని అన్నారు. ఇవి భారత్‌లో అత్యధికమని పేర్కొన్నారు.