1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (13:45 IST)

త్వరలో రాజధానిపై ప్రకటన.. విశాఖలో ఇక రోజూ పండగే : విజయసాయి రెడ్డి

రాజధానిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వస్తుందన్నారు. ఆ తర్వాత విశాఖలో రోజూ సందడే ఉంటుందని ఆయన చెప్పారు. రాజధాని మార్పుపై అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈయన వ్యాఖ్యలను బట్టి చూస్తే విశాఖ రాజధానికావడం తథ్యమని తేలిపోయింది. 
 
ఈనేపథ్యంలో శనివారం విజయసాయి రెడ్డి విశాఖలో మాట్లాడుతూ, విశాఖలో వైసీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని... సీబీఐతో కాకపోతే ఎఫ్బీఐతో విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. 
 
ముఖ్యంగా, చంద్రబాబు ఒక కుటిల స్వభావం కలిగిన వ్యక్తి అని విమర్శించారు. న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విశాఖను రాజధాని కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
 
పైగా, తన కుటుంబసభ్యులను తప్ప ప్రపంచంలో మరెవరినీ నమ్మరన్నారు. చంద్రబాబు స్వార్థపరుడని... తన సొంత కుటుంబం మాత్రమే సంతోషంగా ఉండాలని అనుకుంటారని విమర్శించారు. కుటిల రాజకీయాలు, ఇన్సైడర్ ట్రేడింగులు చంద్రబాబు వల్లే అవుతాయి కానీ మరెవరి వల్ల కావని అన్నారు. 
 
అమరావతితో చంద్రబాబు అండ్ గ్యాంగ్ చేయని అక్రమాలు అంటూ లేవన్నారు. అమరావతి పేరుతో వారు వ్యాపారం చేశారని ఆరోపించారు. ఇక్కడ టీడీపీ నేతలు భారీగా ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, వీటిని త్వరలోనే నిగ్గుతేల్చుతామని చెప్పుకొచ్చారు.