గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (12:52 IST)

బీసీజీ నివేదిక కూడా అమరావతి తరలింపునకే మొగ్గు?

నవ్యాంధ్ర రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ)ను ఏపీ సర్కారు ఏర్పాటు చేసింది. ఈ బీసీజీ రాజధాని తరలింపుతో పాటు.. అభివృద్ధి, మౌలిక సదుపాయాలరూపకల్పన తదితర అంశాలపై ఓ నివేదిక ఇవ్వనుంది. రాజధాని తరలింపుపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. ఇందులో రాజధానిని విశాఖకు తరలించాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చే నెల మూడో తేదీన బీసీజీ తన నివేదికను సమర్పించనుంది. ఇది కూడా రాజధానిని తరలించాలని సూచన చేయనున్నట్టు సమాచారం. 
 
ఎందుకంటే ఈ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఇందులో అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. పూర్తిగా నూతన నగరాన్ని (గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్‌గా) రాజధానిగా అభివృద్ధి చేయడమంటే రాష్ట్ర ఖజానాపై పెనుభారం మోపడమేనని అభిప్రాయపడింది.
 
అదేసమయంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన (బ్రౌన్‌ఫీల్డ్) నగరంలో రాజధానిని ఏర్పాటు చేయడం అన్ని విధాలా మంచిదని బీసీజీ మధ్యంతర నివేదిక పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాజధాని వికేంద్రీకరణ ద్వారా అమరావతి రైతులు నష్టపోకుండా చూడడంతోపాటు, విజయవాడను మహానగరంగా తీర్చిదిద్దేందుకు పలు సూచనలు చేసింది. కృష్ణా నదిపై మూడు చోట్ల కొత్తగా వంతెనలు నిర్మించి రాజధాని ప్రాంతంతో అనుసంధానం చేయడం వల్ల ఆ ప్రాంతంలోని భూముల ధరలు పడిపోకుండా చూడొచ్చని పేర్కొంది.