1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (11:13 IST)

రాజధాని రైతులతో మాటల్లేవ్‌... వారిని చంద్రబాబు మోసం చేశారు...

రాజధాని రైతులతో మాటల్లేవ్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా, రాజధాని రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఎదురుదాడి చేసినట్టు తెలుస్తోంది. 
 
శుక్రవారం వెలగపూడిలో ఏపీ మంత్రివర్గం సమావేశం జరిగింది. ఇందులో రాజధాని తరలిపోతుందన్న బాధతో ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులతో సంప్రదింపులు జరపాలని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి సీఎం జగన్‌కు సూచించారు. కానీ, కృష్ణా జిల్లాకు చెందిన ఏ ఒక్క మంత్రిగానీ, సీఎంగానీ నోరుమెదపలేదు. 
 
పైగా, రాజధాని పోతోందన్న ఆగ్రహంతో వారున్నారని.. చంద్రబాబు వారిని మోసం చేశారని.. వారితో ఏం సంప్రదింపులు జరుపుతామని అన్నట్లు సమాచారం. అలాగే రాజధాని ప్రాంత రైతులు భూములు వెనక్కి ఇచ్చేయాలని కోరితే.. ఇప్పటి వరకూ ఉపయోగించని భూములను తిరిగి యథాతథంగా వారికి ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని నగర అభివృద్ధి కోసం వినియోగించుకున్న భూములకు బదులు వేరే చోట భూములు ఇద్దామన్నారు. 
 
ముఖ్యంగా, రాజధాని ప్రాంత రైతులకు చెల్లించే కౌలు భారం తగ్గించుకోవాలంటే.. భూములు వెనక్కి ఇచ్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో 20 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయని.. వాటిని వాస్తవ లబ్ధిదారులకు అందజేద్దామని అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని పునరుద్ఘాటించారు. 
 
ఈ కుంభకోణంపై సీబీఐ లేదా ఏసీబీ లేదా సీఐడీ లేదా లోకాయుక్తతో విచారణ జరిపించాల్సి ఉందని చెప్పారు. అయితే... న్యాయపరమైన అంశాలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని.. అందువల్ల ఎలాంటి లోపాలూ లేకుండా క్షుణ్ణంగా ఆయా అంశాలను పరిశీలించాల్సిందిగా మంత్రులను సీఎం జగన్ కోరినట్టు సమాచారం.