ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్
ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు వైరల్ అయ్యాయి. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు విడాకులిచ్చిన ఆమె తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన పిల్లలు అకీరా, ఆద్యల బాగోగులు చూసుకుంటూ వారికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అదేసమయంలో అపుడపుడూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాల భైరవుడి జయంతిని పురస్కరించుకుని కాశీ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు ఓ క్యాప్షన్ జోడించారు. కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరుకోకూడదు. మనమే రక్షకుడిగా మారాలి. కాల భైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమేశ్వరుడు పిలిచినపుడు మీరు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తారు. నేను కూడా అంతే.. శివుడు పిలిచినపుడు అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆమె ద్వంద్వార్థంలో పోస్ట్ చేశారు.
కొంతకాలం క్రితం తాను సన్యాయం తీసుకుంటానని రేణూ దేశాయ్ ప్రకటించి అందరికీ షాకిచ్చిన విషయం తెల్సిందే. గతంలో రెండో పెళ్ళి చేసుకుంటానని చెప్పిన ఆమె.. అనూహ్యంగా సన్యాసం వైపు మొగ్గు చూపుతున్నారంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇపుడు కాశ్మీకి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో ఆమె తన సన్యాస నిర్ణయానికే కట్టుబడివున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.