బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (11:37 IST)

దేశంలో 45,576 కేసులు.. తెలంగాణాలో 1,058 పాజిటివ్ కేసులు

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45576 కaరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం వెల్లడైంది. ఈ కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,484కి చేరింది. ఇక గత 24 గంటల్లో 48,493 మంది కోలుకున్నారు.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 585 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,31,578 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 83,83,603 మంది కోలుకున్నారు. 4,43,303 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో బుధవారం వరకు మొత్తం 12,85,08,389 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,28,203 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో గత 24 గంటల్లో 1,058  కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,440 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,834 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,46,733 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,419 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,682 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 10,352 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 91 కేసులు నిర్ధారణ అయ్యాయి.