శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (12:34 IST)

భారతీయులకు జై కొడుతున్న బైడెన్.. మంత్రివర్గంలో ఇద్దరికి చోటు!!

అమెరికా కొత్త అధ్యక్షుడుగా జో బైడెన్ గెలుపొందారు. ఈయన వచ్చే యేడాది జనవరి 20వ తేదీన శ్వేతసౌథం 46వ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఈయన ఏర్పాటు చేయనున్న మంత్రివర్గంలో ఇద్దరు భారతీయులకు చోటు కల్పించనున్నట్టు సమాచారం. 
 
ఇప్పటికే తన డిప్యూటీగా (అమెరికా ఉపాధ్యక్షురాలు) భారత సంతతికి చెందిన కమలా హారీస్‌ను ప్రకటించగా, ఆమె కూడా గెలుపొందారు. ఈ క్రమంలో జో బైడెన్ ఏర్పాటు చేయనున్న కేబినెట్‌లో మరికొందరు భారతీయులకు స్థానం లభించనుంది. 
 
ఎన్నికల ప్రచార సమయంలో బైడెన్‌కు సలహాదారుగా ప‌నిచేసిన వివేక్ మూర్తికి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అమెరికా ఆరోగ్య, మానవ సంబంధాల (హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీస్) మంత్రిగా వివేక్‌ను నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
ఇక స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అరుణ్ మ‌జుందార్‌కు.. ఇంధ‌న శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కొన్ని క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. బైడెన్ టీమ్‌కు సంబంధించిన లిస్టును ఓ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. 43 ఏళ్ల వివేక్ మూర్తి.. ప్ర‌స్తుతం కోవిడ్‌19 స‌ల‌హాదారుల బృందంలో ఉన్నారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఆయ‌న బైడెన్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు.
 
అలాగే, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మెకానిల్ ఇంజినీరింగ్ ప్రొఫెస‌ర్‌గా చేసిన మ‌జుందార్‌.. అక్క‌డే అడ్వాన్స్‌డ్ రీస‌ర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైర‌క్ట‌ర్‌గా చేశారు. ఎన‌ర్జీ సంబంధిత అంశాల్లో బైడెన్‌కు అడ్వైజ‌ర్‌గా చేశారు. 
 
హోంల్యాడ్‌ సెక్యూరిటీ సైబర్‌ చీఫ్‌ను తొలగించిన ట్రంప్ 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందన్న ట్రంప్ వాదనలను బహిరంగంగా తిరస్కరించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సైబర్ చీఫ్ క్రిస్టోఫర్ క్రెబ్స్‌ను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తొలగించారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ అయిన క్రెబ్స్‌ను 2018లో ట్రంప్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీకి (సీఐఎస్‌ఏ) మొదటి డైరెక్టర్‌గా నామినేట్ చేశారు.
 
2020 ఎన్నికల భద్రతపై తన ప్రకటన 'సరికాదని' పేర్కొంటూ ట్రంప్ ట్విట్టర్‌లో క్రెబ్స్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ట్విట్టర్ రెండు ట్వీట్లను హెచ్చరిక లేబుళ్ళతో ఫ్లాగ్ చేసింది, 'ఎన్నికల మోసం గురించి ఈ వాదన వివాదాస్పదంగా ఉందని, 2020 ఎన్నికల భద్రతపై క్రిస్ క్రెబ్స్ ఇటీవల చేసిన ప్రకటన సరికాదన్నారు.
 
ఇందులో భారీగా అక్రమాలు, మోసాలు జరిగాయని, చనిపోయిన వారి పేరిట ఓట్లు వేశారని, ఓటింగ్‌ ఆలస్యంగా జరగడం, పోల్‌ వాచర్లను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదని, ఓటింగ్‌ యంత్రాల్లో అవాంతరాలు ఏర్పడ్డాయి' అని ట్వీట్‌ చేశారు. ఎన్నికలపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను క్రిస్‌ క్రెబ్స్‌ ఖండించారు. 
 
'అధ్యక్షుడి వాదనలు ఆధారాలు లేనివి, సాంకేతికంగా అసంబద్ధమైనవి' అంటూ క్రెబ్స్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ట్రంప్‌ సైసా సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీ డైరెక్టర్‌ పదవి నుంచి తొలగించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ ఎన్నికల్లో విజేతగా ప్రకటించినప్పటి నుంచి.. ఎన్నికల్లో విస్తృతంగా మోసం జరిగిందని ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఫలితాలను చట్టపరంగా సవాల్‌ చేస్తానని స్పష్టంచేశారు.