శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 10 జులై 2019 (16:29 IST)

సరికొత్త మొబైల్ ట్రాకింగ్.. ఇక తప్పించుకోవడం మీ తరం కాదు

టెక్నాలజీ పెరిగింది.. తెలివితేటలు కూడా అమోఘంగా పెరిగాయి. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎన్ని జిమ్మికులైనా చేసి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటున్నారు. పోలీసులకి కూడా దొరక్కుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. మొబైల్‌లో సిమ్ ఉంటే పోలీసులు కనిపెట్టేస్తున్నారని దాన్ని కూడా తీసేస్తున్నారు. 
 
అయితే ఇప్పుడు ఒక కొత్త టెక్నాలజీకి రూపకల్పన జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ పేరు మొబైల్ ఫోన్ ట్రాకింగ్. దీని ద్వారా సిమ్ తీసేసినా, మొబైల్‌కి ఉండే ఐఎంఈఐ నెంబర్ మార్చేసినా కూడా సదరు వ్యక్తి ఎక్కడున్నదీ పోలీసులు ఇట్టే కనిపెట్టేస్తారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. 
 
ఆగస్టు నుంచి ఇది వాడకంలోకి వస్తుంది.
 నేరాలు చేసి మొబైల్ స్విచ్ఛాప్ చేసే కేటుగాళ్లను, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టే ప్రబుద్ధులను పట్టుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. 
ఎవరైనా మొబైల్ కొట్టేసినా, ఐఎంఈఐ మార్చితే, సీఈఐఆర్ టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. దీన్లో అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్ ఉంటుంది. మొబైల్ ఆపరేటర్లు ఈ డేటాను ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. దాన్నిబట్టి మొబైల్ ఎక్కడుందీ తెలుస్తుంది. 
 
అంతేకాదు.. ఆ మొబైల్‌కి ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న ఆపరేటర్ ఎవరనేది కూడా తెలుసుకోవచ్చు.
 మొబైల్ దొంగతనాల కంప్లైంట్స్ కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్ 14422 జారీ అయ్యింది. దీనికి కంప్లైంట్ ఇవ్వొచ్చు. దొంగ దేశంలో ఎక్కడున్నా ఈజీగా కనిపెట్టేయొచ్చు. ఈ సిస్టమ్‌ని మొదట మహారాష్ట్రలో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో ఆగస్టు నుంచి దేశమంతా అమలు చేస్తామని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఐఎంఈఐ నెంబర్ మార్చితే మూడేళ్ల జైలు శిక్ష తప్పదు.