1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
  4. Chandra Babu fire on Narendra Modi, YS Jagan Mohan Reddy KCR

ఇచ్చేది ఏమైనా నీ అబ్బ సొత్తా : మోడీపై చంద్రబాబు ఫైర్

Chandra Babu
ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగాల్లో దూకుడును పెంచారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, తెరాస సీఎం కేసీఆర్, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలపై మాటలదాడికి దిగారు. పోలవరం తనకు ఏటీఎం అంటూ వ్యాఖ్యానించిన నరేంద్ర మోడీని  ఏకిపారేశారు. పోలవరం నిర్మాణానికి 56 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తే, ముష్టిగా రూ.7 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పైగా, ఇచ్చింది ఏమైనా నీ అబ్బ సొత్తా అంటూ మోడీ నిలదీశారు. 
 
తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆయన మంగళవారం మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీలా తాను అసమర్ధుడిని కాదన్నారు. ఒకవైపు కేంద్రం నిధులు ఇవ్వక పోయినా, పొరుగు రాష్ట్రం తెలంగాణ సహకరించక పోయినా తాను మాత్రం ఏమాత్రం వెనక్కితగ్గలేదన్నారు. 
 
సిగ్గు, లజ్జ, గౌరవం, స్థానం లేని వ్యక్తి నరేంద్ర మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. జూలై నెలలో గ్రావిటీ ద్వారా పోలవరానికి నీళ్లు తెస్తామన్నారు. పోలవరం నిర్మాణం పనులపై మీ ప్రభుత్వ(కేంద్రం)మే తనకు అవార్డు ఇచ్చిందన్నారు. అంతేకాకుండా, ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నిర్మాణ పనులు సాగుతున్న ప్రాజెక్టుగా పోలవరం చరిత్రపుటలెక్కిందన్నారు. 
 
ఇకపోతే, కోడికత్తి పార్టీకి మోడీతో పాటు కేసీఆర్ భారీ మొత్తంలో నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే ప్రత్యేక హోదా ఖాయమని, ఈ మేరకు రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టంగా హామీ ఇచ్చారన్నారు. చివరగా పవన్ కళ్యాణ్‌కు ఏమీ తెలియదని కేవలం అత్తారింటికి దారి మాత్రమే తెలుసన్నారు. 
తర్వాతి కథనం
ఏపీలో తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..