1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (12:26 IST)

తిరుపతి వేదికగా దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీ : ఈ రోజు టాపిక్ ఏంటి?

దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్రం హోంమంత్రి అమిత్ షా శనివారమే తిరుపతికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు ఉన్నారు. కాసేపట్లో అమిత్ షా, సీఎం జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.
 
కాగా, అమిత్ షా రాక నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద బీజేపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. అమిత్ షా ఎయిర్ పోర్టు నుంచి వెలుపలికి రాగానే నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ శ్రేణులకు అభివాదం చేసిన ఆయన సీఎం జగన్‌తో కలిసి తిరుమల పయనమయ్యారు. 
 
ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ కార్యక్రమాలలో పాల్గొననున్న అమిత్ షా... మధ్యాహ్నం 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు పాల్గొంటారు.
 
ఇదిలావుంటే, 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వేదపండితులు మహాద్వారం వద్ద వీరికి స్వాగతం పలికారు.
 
అనంతరం స్వామివారిని దర్శించుకున్న షా, జగన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. టీటీడీ చైర్మన్, ఈవోలు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలతో పాటు కాఫీ టేబుల్‌ బుక్, 2022 డైరీ, క్యాలెండర్, టీటీడీ అగరబత్తులను అందజేశారు. అంతకు ముందు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న అమిత్‌ షా, జగన్‌కు మంత్రి వెలంపల్లి, అధికారులు స్వాగతం పలికారు.
 
కాగా, 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎం.రంగస్వామి, లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్, అండమాన్‌ నికోబార్‌ ఐలండ్స్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అడ్మిరల్‌ డి.కులానంద్‌ జోషి, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి రుబీనా ఆలీ, తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌ హాజరు తదితరులు పాల్గొనున్నారు. పలువురు ప్రముఖ రాకతో తిరుపతి కోలాహలంగా మారింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై తొలిరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.