ప్లీజ్.. మాకు ఇంకో వందే భారత్ రైలును కేటాయించరూ... రైల్వే మంత్రికి సీఎం బాబు వినతి
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో విజ్ఞప్తి చేశారు. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగుళూరుకు చేరుకునేందుకు వీలుగా వందే భారత్ రైలును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రైల్వే మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంగళవారం రైల్వే మంత్రి వైష్ణవ్ను కలిసి ఒక సమగ్రమైన వినతిపత్రాన్నిఅందజేశారు.
అలాగే, ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైదరాబాద్ - బెంగుళూరు, హైదరాబాద్ - చెన్నై, చెన్నై - బెంగుళూరు హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏపీని తాకుతూ ప్రకటించడంపై చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో బెంగుళూరు - చెన్నై హైస్పీడ్ రైలు మార్గాన్ని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతికి అనుసంధానం చేయాలని ప్ర్యేకంగా కోరారు.
విజయవాడ - బెంగుళూరు ప్రాంతాల మధ్య తిరుపతి మీదుగా మరో వందే భారత్ రైలును నడపాలని ఆయన కోరారు. ఇకపోతే, విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ప్రారంభించేలా తక్షణం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.