1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (08:32 IST)

బద్వేల్ వైకాపా ఎమ్మెల్యే కన్నుమూత

కడప జిల్లాలోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పూర్తిచేసుకుని మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు. 
 
అయితే మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో సుబ్బయ్యను కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కన్నుమూశారు. ఆయన మృతి చెందారని తెలుసుకున్న అభిమానులు, అనుచరులు విషాదంలో మునిగిపోయారు. 
 
మరోవైపు వైసీపీ కార్యకర్తలు, ద్వితియశ్రేణి నాయకులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన సుబ్బయ్య మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, ఎమ్మెల్యే మృతిపట్ల సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.