పార్టీ కోసం దశాబ్దకాలం కష్టపడితే రౌడీషీటర్ అంటారా? సజ్జలపై మండిపడిన బోరుగడ్డ
వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం పదేళ్లపాటు కష్టపడితే ఇపుడు రౌడీషీటర్ అంటారా అని నిలదీశారు. తన భార్యతో కలిసి బోరుగడ్డ తాడేపల్లిలోని వైకాపా ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. నాలుగు గంటలకుపైగా వారిద్దరూ ఎండలోనే కూర్చుని నిరసన తెలుపుతున్నా పార్టీ నాయకులు ఎవరూ వారి వద్దకు రాలేదు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా కోసం పదేళ్లు కష్టపడితే.. ఆ పార్టీ వాళ్లే తనను రౌడీషీటర్ అని అంటున్నారని వాపోయారు. వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డే.. పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డితో తనపై ఈ దుష్ప్రచారం చేయించారని విమర్శించారు. కారుమూరిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని, సజ్జల బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
'సొంత పార్టీ వాళ్లే నన్ను రౌడీషీటర్ అని అంటుంటే మా కుటుంబం కుంగిపోయింది. సజ్జల ఒక్క రోజైనా పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీదకొచ్చారా? జగన్, ఆయన కుటుంబం కోసం పదేళ్లు కష్టపడి పనిచేశా. ఆర్థికంగా చితికిపోయి నా కుటుంబం రోడ్డు పైకొచ్చింది. 9 నెలలు జైల్లో ఉన్నా. జగన్ను కలిసేందుకు వస్తే లోపలికి రానివ్వడం లేదు. జగన్ పిలిచి మాట్లాడేంతవరకు ఎన్నిరోజులైనా సరే ఇలాగే వచ్చి రోడ్డు మీద కూర్చుంటా' అని స్పష్టం చేశారు.
