శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (09:04 IST)

అఖిలప్రియ భర్తపై కేసు

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ నాయుడిపై గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదయింది. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భార్గవనాయుడిపై స్థానికంగా భూవివాదాల్లో రెండు కేసులు నమోదయ్యాయి.

అళ్లగడ్డ పీఎస్‌, ఎస్‌ఐ రమేశ్‌ కుమార్‌ ఆ కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. భార్గవనాయుడు నానక్‌రాంగూడలోని ఓ విల్లాలో ఉంటున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వచ్చారు. భార్గవ నాయుడు తన కారులో గచ్చిబౌలి వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్న ఎస్సై, ఆయన కారును ఆపేందుకు ప్రయత్నించాడు.
 
గమనించిన భార్గవ్‌ నాయుడు విధి నిర్వహణలో ఉన్న ఎస్సై రమేశ్‌ కుమార్‌పైకి మళ్లించాడు. చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకొన్న ఎస్సై గచ్చిబౌలి పోలీసులకు భార్గవ్‌ నాయుడుపై ఫిర్యాదు చేశాడు.

విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపైకి కారుతో దూసుకువచ్చే ప్రయత్నం చేయడం, విధులకు ఆటంకం కలిగించినందుకు అతనిపై ఐపీఎస్‌ 353, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీనివాస్‌ పేర్కొన్నారు.